Sunday, April 28, 2024

తెలంగాణకు ప్రాణహితం

- Advertisement -
- Advertisement -

మన దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో సకాలంలో వర్షాలు కురవక దేశంలోని అత్యధిక శాతం సాగునీటి జలాశయాలు వెలవెలబోతున్నా యి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ
రాష్ట్రంలో మాత్రం పలు ప్రాజెక్టులు నీటి నిలువలతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి గోదావరి బేసిన్ పరిధిలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణలో సాగునీటిరంగానికి జీవనాడిగా మారింది. రాష్ట్రంలోని 50శాతం పైగా వ్యవసాయరంగాన్ని ఇప్పుడు ఈ పథకమే ఆదుకుంటుంది. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న ప్రాణహిత నదీజలాలు ఖరీఫ్ పంటల సాగుకు లైఫ్‌లైన్‌గా నిలుస్తున్నాయి. ప్రధాన గోదావరి నది ద్వారా ఎగువ నుంచి ఇంకా వరదనీటి ప్రవాహాలు ప్రారంభం కాకపోయినా , ఎగువన మహారాష్ట్ర ,చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదీద్వారా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరినదిలోకి వరద నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ వర్షాకాల పంటల సాగు ప్రారంభానికి ఈ నదీజాలాలే ప్రాణం పోస్తున్నాయి. మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులుగా గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ప్రారంభంలోనే తెరుచుకున్నాయి. అయినప్పటికీ ఎగువ నుంచి బాబ్లీ గేట్ల ద్వారా చుక్కనీరు కూడా దిగువకు చేరుకోలేదు. బాబ్లీకి దిగవన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇప్పట్లో ఎగువ గోదావరి నుంచి వరదనీటి ప్రవాహాలు వస్తాయన్న ఆశలు అడుగంటాయి. మహారాష్ట్రలో గోదావరి నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిర్ ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణహిత నదిద్వారా వస్తున్న వరద నీటిని మేడిగడ్డ వద్ద ఒడిసి పడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ద్వారా లక్ష్మీపంప్‌హౌస్ నుంచి సరస్వతి ,పార్వతి బ్యారేజ్‌లకు ప్రాణహిత నదీజలాలు చేరకుంటున్నాయి. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి భూగర్భంలో నిర్మించిన సొరంగ మార్గాల ద్వారా శ్రీరాం సాగర్ వరద కాలువలోకి చేరుతున్నాయి.

రెండు టిఎంసీలు పెరిగిన నీటినిల్వ:
పునరుజ్జీవ పథకం వల్ల శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో జలకళ ఉట్టిపడుతోంది. 112టిఎంసీల నీటి నిలువ సామర్ధంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 196టిఎంసీల గోదావరి జలాలను ఉపయోగించుకోవాలన్నది లక్షం కాగా , పునరుజ్జీవ పధకంతో ఇక లక్షసాధనకు భరోసా ఏర్పడింది. శ్రీరాంసాగర్ ్రప్రాజెక్టులోకి ప్రాణహిత నదీజలాలు ఎదురేగుతూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి.122కిలోమీటర్ల నిడివిన ఉన్న వరదకాలువలో నీటి నిలువ సామర్దం 1.5టిఎంసీలు కాగా ఇప్పటికే ప్రాణహిత జలాలు వరదకాలువను నింపేశాయి. రోజుకు ఒక ఒక టిఎంసీ చొప్పున శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో మొత్తం 30టిఎంసీల నీటిని నింపాలని లక్షంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు

. తొలిదశగా రోజుకు ఆర టిఎంసీ చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీరాంసాగర్‌లో నీటినిలువ 21టిఎంసీలకు పెరిగింది. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభం అయ్యాక శనివారం నాటికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 1.98టిఎంసీల నీరు చేరుకుంది. వరద కాలువ ద్వారా 3627క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటోంది. శ్రీపాద ఎల్లంపల్లిలోకి 6381క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 2.69టిఎంసీల నీరు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నీటినిలువ 12.21టిఎంసీలకు పెరిగింది.
14లక్షల ఎకరాలకు సాగునీరు
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా 14లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్షంగా పెట్టుకున్నారు. వర్షాకాలంలో రుతుపవనాల జాప్యం, ఎగువన మహారాష్ట్ర నుంచి నీటి రాక మందగించిన సమయాల్లో, పునరుజ్జీవ పథకం ఆమలులోకి తేనున్నారు. దిగువ 250కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పంపుల ద్వారా గోదావరి నీటిని వెనక్కు తీసుకువచ్చి వరద కాలువలోకి వదిలి ఆ నీటిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి మళ్లించేందుకు సిఎం కేసిఆర్ 2017లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News