ఏటూరునాగారం: కాళేశ్వరం నివేదిక చూసి నిర్ఘాంతపోయామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల అవినీతి, అసమర్థత వల్లే కూలిపోయిందని కమిషన్ చెప్పిందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా దేవాదుల పంపుహౌస్ను పరిశీలించి.. పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి దేవాదుల (Devadula Project) అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. పెండింగ్ బిల్లులు కూడా త్వరగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు (Devadula Project) పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లోని ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూసేకరణపై కలెక్టర్లు త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత కాళేశ్వరం విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాళేశ్వరం డిజైన్ చేసింది వారే.. కూలిపోయింది వారి హయాంలోనే. కాళేశ్వరం నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవు. నీటిని 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచొద్దని ఎన్డిఎస్ఎ స్పష్టంగా చెప్పింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం’’ అని ఉత్తమ్ అన్నారు.