Friday, May 10, 2024

విద్యారంగానికి సిఎం అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

టిఎస్ యుటిఎఫ్ సమావేశంలో ఎంఎల్‌సి నర్సిరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా విద్యారంగంలో కూడా మార్పులు రావాలని, విద్యా రంగాన్ని సమీక్షించాలని ఉపాధ్యాయులందరూ ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఆదివారం నాడు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కొత్తగా కొలువుదీరిన నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉన్నందున విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, పర్యవేక్షణా వ్యవస్థను పునరుద్దరించాలని, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సర్వీసు రూల్సుకు సంబంధించి తొమ్మిదన్నరేళ్ళుగా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పట్టించుకోకపోవడం వలన పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడిరదని అన్నారు. అర్థాంతరంగా నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, జిఒ 317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకుంటారని పెండింగ్ డిఎలు మంజూరు చేయాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది కొన్ని నెలలుగా విడుదల కాని బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ సిహెచ్. రాములు, సిహెచ్. దుర్గాభవాని,టి. లక్ష్మారెడ్డి, పి. మాణిక్‌రెడ్డితోపాటు 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News