బారికేడ్ల ఎత్తివేతపై రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో కీలక జాతీయ రహదారులను ఇంతకాలం ఎవరు బంద్ చేశారు? ఎవరు బారికేడ్లు పెట్టారనేది ఇప్పుడు నిర్థారణ అయిందని నిరసనలలో ఉన్న రైతు సంఘాలు శుక్రవారం స్పందించాయి. టిక్రి, ఘాజీపూర్ వద్ద ఢిల్లీపోలీసులు శుక్రవారం బారికేడ్లను ఎత్తివేస్తున్న అంశంపై రైతు నేతలు మాట్లాడారు. దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాలలో తాము ఎప్పుడు కూడా రాకపోకలను అడ్డుకోలేదని ఇంతకాలం చెపుతూ వస్తున్నామని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులే వారు సిమెంట్ కట్టడాలతో ప్రతిష్టించిన దిమ్మెలను ఇనుపతీగలను తొలిగిస్తున్నారని , దీనితో ఎవరి వాదన నిజమనేది ఎవరైనా నిర్థారించుకోవచ్చునని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకూ పోలీసులే బారికేడ్లు ఏర్పాటు చేశారని తాము కాదని ఇప్పటి చర్యతో స్పష్టం అయిందని వివరించారు. సింఘూ సరిహద్దుల వద్ద రైతులు రోడ్లను ఆక్రమించుకుని లేరని, అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున అంతకు ముందే ట్రాఫిక్ నిలిపివేశారని , ఇక తమ నుంచి రోడ్ల దిగ్బంధం ప్రస్తావనలో అర్ధం ఉందా? అని రైతు నేత దర్శన్పాల్ ప్రశ్నించారు.