బెంగాలీ మహిళలకు మమత పిలుపు
కోల్కత: బెంగాలీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి బయట నుంచి గూండాలను బిజెపి తీసుకువస్తోందని, ఇలాంటి వారిని గరిటలు, అట్లకాడలతో ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణ్గఢ్, పింగ్లాలో రెండు బహిరంగ సభలలో ఆమె శనివారం ప్రసంగిస్తూ తన మాజీ అనుచరుడు సువేంద్రు అధికారి, ఆయన కుటుంబాన్ని నమ్మక ద్రోహులుగా అభివర్ణించారు.
30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం రాత్రి సువేందు అధికారి సోదరుడు ఒకరు ప్రజలకు డబ్బులు పంచిపెట్టాడని, స్థానిక మహిళలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని మమత తెలిపారు. అతనితోపాటే బయట ప్రాంతాల నుంచి కిరాయికి తెచ్చిన మరో 20 మంది గూడాలను కూడా స్థానికులు పోలీసులకు అప్పగించారని ఆమె చెప్పారు. మొదటి విడత పోలింగ్తోనే బిజెపి భవిష్యత్తు తేలిపోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఢిల్లీకి చెందిన అమిత్ షా బెంగాల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారని, ఎన్నికల సంఘం ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.