మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం కారణంగా నల్లమలలో వాహనాల రద్దీ లేని కారణంగా వన్య ప్రాణులు యధేచ్చగా స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారి జోజి తెలిపారు. అటవీప్రాంతంలోని ప్రధాన రహదారులలో జనసంచారం వాహన లేకపోవడం, శబ్ద వాయు కాలుష్యం లేని కారణంగా వన్యప్రాణులకు రహదారులపై కి వచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈక్రమంలో వన్యప్రాణులకు ఎలాంటి హానీ జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా 10 సోలార్ సిసి కెమెరాలతో నిఘా అధికం చేశామన్నారు.
శ్రీశైలం రోడ్ల పై పులులు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, ఇక కోతులు, పాముల సంచరించే ప్రాంతాలలో కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. నిత్యం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనాల సంచారం పూర్తిగా లేకపోవడంతోనే జంతువులు అడవుల నుంచి బయటకు వస్తున్నాయన్నారు. శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని, ఈనేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అనుక్షణం వన్యప్రాణుల కదలికలపై కన్నేశామన్నారు.
కరోనా సోకుండా జాగ్రత్తలు
నల్లమల అటవీప్రాంతంలో జంతువులకు కరోనా సోకకుండా పకడ్బందీ ఏర్పాట్లు 10 సోలార్ సిసి కెమెరాలతో నిఘా సారిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా అడవిలోకి అనుమతించడం లేదని, కరోనా జంతువులకు సోకకుండా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు మాసం వరకు అడవిలో ఎవరికీ అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అడవిలో సంచరించి నట్లయితే వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం సువిశాలమైన ప్రకృతి రమణీయ నల్లమల ప్రాంతంలో వాహనాల రద్దీ లేకపోవడంతో ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సయ్యాటలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తునన్నాయన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి, భక్తులను నిలువరించడంతో ప్రతిరోజూ ఐదు వందల వాహనాలపై గా శని ఆదివారాల్లో రెండువేల వాహనాలకు పైగా హైదరాబాద్ నుండి శ్రీశైలం రోడ్డుపై ప్రయాణిస్తాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా రద్దీ అమాంతం తగ్గిపోగా, సువిశాలమైన నల్లమల్ల శ్రీశైలం రహదారులు బోసిపోయాయన్నారు.
750 నీటి సాసర్ల ఏర్పాటు : నల్లమలలోని వన్యప్రాణుల దాహర్తి కోసం 750 నీటి సాసర్ లు ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారి జోజి తెలిపారు. అభయారణ్యంలో 20 పెద్ద పులులు, 103 చిరుత పులులు,170 ఎలుగుబంట్లు, 5000 జింకలు కొన్ని వేలకుపైగా అడవి కుక్కలు, అడవి పందులు, కోతులు, దుప్పులు, నెమళ్ళు, అడవి కోళ్ళు ఇతర వివిధ జాతుల జంతువులన్నీ నివాసం ఉంటున్నాయన్నారు. వీటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగిచామని ఆయన వివరించారు.