నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు మండిపడ్డారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్డీలర్లకు.. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమని అన్నారు. రేషన్ డీలర్లు మంగళవారం నగరంలోని తన నివాసంలో హరీష్రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదని, ఎన్నికల ముందు అబద్దపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు తప్ప చేతలులేని కోతల ప్రభుత్వం ఇది అని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించామని గుర్తు చేశారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్ను 900 నుంచి 1400 రూపాయలకు పెంచామని, ప్రభుత్వంపై 139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్ డీలర్ల సంతోషం కోసం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 2014లో మెట్రిక్ టన్నుకు 200 రూపాయలుగా ఉన్న కమీషన్ను, 1400 రూపాయలకు పెంచామని, 17వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపామని అన్నారు. కమీషన్ చెల్లించడమే కాదు, కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేశామని చెప్పారు.
రేషన్ డీలర్షిప్ వయో పరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచామని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని హరీష్రావు తీవ్రంగా ఖండించారు. ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమీషన్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు 5 వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు ప్రకటించాలని హరీష్రావు బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
Also Read: ఒకే జిమ్లో రాజ్ నిడమోరుతో సమంత..