Tuesday, April 30, 2024

మధ్యప్రదేశ్‌లో అమానుషం

- Advertisement -
- Advertisement -

Women Beaten With Sticks By Family in Madhya Pradesh

 

మేనమామ కుమారులతో ఫోన్ మాట్లాడుతున్నారని
అక్కా చెల్లెల్లను చితకబాదిన కుటుంబ సభ్యులు
కర్రలతో విచక్షణారహితంగా దాడి

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అతి క్రూరమైన ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌లో తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేయడమే కాకుండా బంధువులతో మాట్లాడుతున్నారని ఇద్దరు అక్కా చెల్లెళ్లలను సొంత కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా చితకబాదారు. దాడికి ఉపయోగించిన కర్రలు విరిగే వరకు చావబాదారు. చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గత నెల 22 న ధార్ జిల్లాలోని పీపాల్వా గ్రామంలో జరిగింది. ఈ వీడియో 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దాడి చేసి చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళలు, పురుషులు కలిసి అమ్మాయిల జట్టు పట్టుకుని రాళ్లు, కర్రలతో దాడి చేస్తుండగా, తమను క్షమించాలని వారు వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. దాడిచేసిన వాళ్లలో ఓ యువతి కూడా ఉంది.

బాధితుల వయసు 19, 20 సంవత్సరాలు. బాధిత యువతులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. తర్వాత ఓ యువతిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం నమోదు చేశారు. గ్రామంలోని ఓ స్కూలు వద్ద తమను అడ్డుకున్న బాబాయి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. యువతులిద్దరినీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అత్తారింటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ మహిళను చెట్టుకు కట్టేసి తల్లిదండ్రులు, సోదరులు దాడిచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News