Tuesday, April 30, 2024

హైదరాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవం

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ నాయకత్వంలో గూడాలు, తండాల అభివృద్ధి
గిరిజన ఆవాలన్నింటికి కరెంట్, రోడ్డు వసతి
గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య, భోజన వసతి
గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్

World Adivasi Day celebrated in Hyderabad

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసి గూడెంలలో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. గిరిజనులు ప్రపంచంతో పోటీ పడేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “ మా తాండలో… మా గూడెంలో మా రాజ్యం ” అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చిందన్నారు. మాసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీల గుస్సాడి, కళాకారుల నృత్య ప్రదర్శనలు, విద్యార్థుల నాటక ప్రదర్శనలు కన్నులపండుగగా జరిగాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా ఆదివాసీ గూడేలను, తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని ఆదివాసీ,గోండు గూడేలకు స్వచ్ఛమైన, శుద్ధిపరిచిన తాగునీరు అందుతుందని చెప్పారు. ఆదివాసీ ఆవాసాలకు 3 ఫేజ్ విద్యుత్ ఇస్తున్నామని మంత్రి సత్యవతి చెప్పారు. ఆదివాసీల పిల్లల విద్య కోసం ఎస్‌టి గురుకులాలను ఏర్పాటు చేసి అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, జెఈఈ, మెడిసిన్‌లలో విజయాలు సాధించి న ఈ విద్యార్థులు అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 91 గురుకులాలు మాత్రమే ఉంటే కెసిఆర్ పాలనలో 183 గురుకులాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాజేంద్రనగర్‌లో ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐఐటి స్టడీ సెంటర్‌లో చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన కాలేజీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను సత్కరించి నగదు నగదు పురస్కారాలు అందజేశారు. ట్రైకార్, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని ఆదిమజాతి తెగలైన చెంచు, కొలం, తోటి, కొండారెడ్డి కుటుంబాల ఆరోగ్య పోషణ, జీవనోపాధి పెంపుదల కోసం డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, అనుసంధానంతో పెరటి తోటల కోళ్ళ పెంపకం కార్యక్రమం అమలు కోసం ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆదిమ జాతి తెగల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 20 కోళ్ల చొప్పున ఐటిడిఎ ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన కొ ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రమావత్ వాల్య నాయక్, గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ , పద్మశ్రీ కనకరాజు, పద్మశ్రీ సకిన రామచంద్రయ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News