Friday, May 3, 2024

రెండేళ్లలో 1.53 లక్షల ఇళ్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం పెరిగిపోతోంది. న్యాయస్థానాల ఆదేశాలతో 2022, 2023 సంవత్సరాల్లో ప్రభుత్వాధికారులు ఇళ్ళను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.4 లక్షల మంది ప్రజలను వారివారి ఇళ్ళనుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. స్థానిక అధికారులు, రాష్ర్ట స్థాయి, కేంద్ర స్థాయి అధికారులు 2023, 2024 సంవత్సరాల్లో ఈ చర్యలకు పూనుకున్నారు. ఈ రెండేళ్ళలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాధికారులు 1.53 లక్షల ఇళ్ళను ధ్వంసం చేసినట్టు ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్ వర్క్’ (హెచ్‌ఎల్‌ఆర్‌ఎన్) అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్ వర్క్’ అనే సంస్థ 23 రాష్ట్రాల్లో, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి, ద్వితీయ స్థాయిలో సేకరించిన సమాచారం మేరకు ఈ వివరాలను నమోదు చేసింది. ప్రజలను వారి వారి ఇళ్ళ నుంచి ఖాళీ చేయించి మరొక ప్రాంతానికి తరలించిన వాస్తవ లెక్కలు వీరు ప్రకటించిన లెక్కల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.

జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం ‘బలవంతంగా ఇళ్ళ ను ఖాళీ చేయించిన దాదాపు అన్ని కేసుల్లో ఏ ఒక్కదాంట్లో కూడా నిబంధనలను పాటించలేదు’ అని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్ వర్క్’ ఆరోపించింది.‘ఇళ్ళను విధ్వంసం చేసిన అనేక సంఘటనల్లో, గతంలో జరిగిన సంఘటనలకంటే మరింత తీవ్రంగా, మరింత క్రూరం గా సాగించారు’ అని ఆ నివేదిక తెలిపింది.‘భారత దేశంలో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం 2022, 2023’ అనే ఈ నివేదిక ప్రకారం, న్యాయస్థానాల ఆదేశాలననుసరించి అధికారులు బలవంతంగా ఖాళీచేయించే ఇళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులపైన ఐక్యరాజ్యసమితి కమిటీ సాధారణ వ్యాఖ్య 7 (1997) ప్రకారం ‘బలవంతంగా ఖాళీ చేయించడం’ అన్న పదాన్ని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్ వర్క్’ ఉపయోగించింది. తగిన చట్టపరమైన, ఇతర భద్రతాపరమైన పద్ధతులు లేకుండా, సంబంధిత వ్యక్తి అభిప్రాయానికి భిన్నంగా, అతని ఇంటిని తాత్కాలికంగా కానీ, శాశ్వతంగా కానీ తొలగించడం’

అన్నఅర్థంతో ‘బలవంతంగా తొలగించడం’ అన్నపదాన్ని వాడారు. న్యాయస్థానాల ఆదేశానుసారం 2022లో, 2023లో మూడు లక్షల ప్రజలు నిరాశ్రయులయ్యారని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ తెలిపింది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 2022లో 33, 360 మందిని, 2024లో 2.6 లక్షల మందిని వారివారి ఇళ్ళ నుంచి ఖాళీ చేయించారు. గతంలో నివాస హక్కులను ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు నిబంధనలను నిర్మాణాత్మకంగా అన్వయిస్తూ వ్యాఖ్యానించేవి. సుప్రీం కోర్టు కానీ, అనేక రాష్ట్రాల హైకోర్టులు కానీ, మనిషి జీవితంలో గృహ హక్కును, నివాస హక్కును ప్రాథమిక హక్కులలో అంతర్లీనమైన భాగంగా భావించేవారని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ తెలిపింది. ‘అధికారులు ఎవరినైనా సరే ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించాలనుకున్నప్పుడు, ఒక సర్వే నిర్వహించి వారికి ముందు పునరావాసం కల్పించాలి’ అని వి. సుధామా సింగ్‌కు, ఢిల్లీ గవర్నర్‌కు (2010), కేంద్ర ప్రభుత్వానికి చెందిన అజయ్ మాకెన్(2019) మధ్య జరిగిన కేసులో ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది.

‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ నివేదిక ప్రకారం ఇళ్ళను ఖాళీచేయించేటప్పుడు, ముఖ్యంగా ఢిల్లీలో ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో పైనపేర్కొన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ నివేదిక ప్రకారం 2022లో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ ధ్వంసం సంఘటనలు 178 వరకు ఉన్నాయి. ఈ సంఘటనల్లో 46,371 ఇళ్ళను ధ్వంసం చేయడం వల్ల 2.3లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనలు 2023లో బాగా పెరిగిపోయాయి. ఫలితంగా 146 ఇళ్ళ విధ్వంసం సంఘటనల్లో 10 లక్షల, ఏడు వేల, 499 ఇళ్ళు ధ్వంసం కాగా, 5 లక్షల పదిహేను వేల మంది నిరాశ్రయులయ్యారు. గడిచిన ఏడేళ్ళకుగాను, 2023వ సంవత్సరంలోనే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ నివేదిక ప్రకారం 2023లో రోజుకు 294 ఇళ్ళు ధ్వంసం చేస్తుండగా, గంటకు 58 మందిని ఖాళీ చేయించారని వెల్లడైంది. అదే 2022లో రోజుకు 129 ఇళ్ళను ధ్వంసం చేస్తుండగా, గంటకు 25 మందిని ఇళ్ళనుంచి ఖాళీ చేయించారు.

అదే 2017 నుంచి 2023 వరకు పది లక్షల 68 వేల మందిని వారి వారి ఇళ్లనుంచి ఖాళీ చేయించగా, 17 మిలియన్ల ప్రజలు స్థానభ్రంశానికి, బెదిరింపులకు గురయ్యారని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ నివేదిక తెలిపింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ గృహ విధ్వంసాలవల్ల ఢిల్లీలోని తుగ్లకాబాద్, అహ్మదాబాద్‌లోని రావ్‌ుపిర్‌నో టెక్రో, నయాఘాట్, అయోధ్యలోని నయాఘాట్‌లలో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం వల్ల గుర్‌గావ్, ఢిల్లీ, అహ్మదాబాద్, అయోధ్య, సూరత్, నవీముంబై వంటి మహానగరాల్లో, చిన్న నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు పెద్దఎత్తున నష్టపోయారు. మురికి వాడల తొలగింపు, భూమిని స్వాధీనం చేసుకోవడం, నగర సుందరీకరణ పేరుతో 59%, అంతకంటే ఎక్కువ మందిని ఖాళీ చేయించారని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ పేర్కొంది. ఈ విధంగా 2023లో 2.9 లక్షల మందిని ఖాళీ చేయించగా, 2022లో 1.43 లక్షల మందిని ఖాళీ చేయించారు. ఇళ్ళను ఖాళీ చేయించిన సంఘటనల్లో చాలా మటుకు అధికారులు చేపట్టిన పద్ధతులు ప్రజలను కష్టాల పాలు చేసే విధంగా, శిక్షించే విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్,

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సహరన్‌పూర్, హర్యానాలోని ‘నూ’ ఢిల్లీలోని జహంగీర్‌పుర్ ఇందుకు చక్కని ఉదాహరణలుగా మిగిలాయి. ఇళ్లను ఖాళీ చేయించడంలో గడిచిన రెండేళ్ళలో దేశ రాజధాని ఢిల్లీ రికార్డు సృష్టించింది. ఒక్క 2023లోనే 2.8 లక్షల మందిని ఖాళీ చేయించారు.ఇళ్ళు ఖాళీ చేయించిన వారికి పునరావాసం కల్పించకపోవడమనేది ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్‌వర్క్’ ప్రకారం 2022, 2023 సంవత్సరాల్లో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించిన 324 సంఘటనల్లో కేవలం 122 కేసుల్లో మాత్రమే వారి సమస్యను పరిష్కరించారు. వీటిలో కూడా దెబ్బతిన్న స్థలాల్లో కేవలం 25కు మాత్రమే, అంటే 20.5 శాతం స్థలాల్లో వారికి మాత్రమే ప్రభుత్వం ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేయడానికి, పునః పరిష్కరించడానికి సిద్ధపడింది. ఏడు స్థలాలకు సంబంధించి పాక్షికంగా, అంటే అంటే 1.6 శాతం మాత్రమే పరిష్కరించడానికి, సిద్ధపడింది. ఆర్థికంగా పరిహారం చెల్లించడానికి కేవలం ఏడు స్థలాల్లో మాత్రమే అంటే 5.7 శాతం మాత్రమే సిద్ధపడింది. ‘అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవి 72% సంఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. బాధితులకు పునరావాసం కల్పించడానికి, వారి సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం విఫలమైంది’ అని ‘హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్ నెట్ వర్క్’ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News