శంషాబాద్ మున్సిపాలిటీలో కూల్చివేతలు
రంగంలోకి దిగిన హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్, ప్లానింగ్ అధికారులు
హైదరాబాద్: అనుమతి లేని వెంచర్లపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా ఝుళిపిస్తోంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కిషన్గూడలో అక్రమలే ఔట్లను శంషాబాద్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో హెచ్ఎండిఏ ప్లానింగ్, ఎన్ఫోర్స్ మెంట్ యంత్రాంగం కూల్చివేసింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం ఊట్పల్లి గ్రామ పంచాయతీ కిషన్గూడ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 64/ఎఎ/1 నుంచి 64/ఎఎ/4 లలో ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ వెంచర్లోని రోడ్లు, కరెంటు స్థంబాలు, ఫుట్పాత్లను హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 75 శాతం మేరకు ధ్వసం చేశారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ సిబ్బంది, ఎన్ ఫోర్స్మెంట్ ఎస్ఐ, ఏఎస్ఐ, 15 మంది కానిస్టేబుళ్లు, శంషాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో అక్రమ లే ఔట్ పై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ లేదా హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కొందరు డెవలపర్లు చేస్తున్న వెంచర్లలో ఎలాంటి క్రయ, విక్రయాలు చేయరాదని ప్రజానీకానికి అధికారులు సూచించారు.