Sunday, April 28, 2024

1 యూరో = 1 డాలర్

- Advertisement -
- Advertisement -

1 euro is now equal to 1 dollar

20 ఏళ్లలో తొలిసారి యూరో దారుణమైన పతనం
తీవ్ర సంక్షోభంలో యురోపియన్ ఆర్థిక వ్యవస్థ
ఉక్రెయిన్ష్య్రా యుద్ధమే ప్రధాన కారణం

వాషింగ్టన్/ న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండగా, మరోవైపు యూరో కూడా మరింత బలహీనపడుతోంది. ఈ ఏడాది యూరో దారుణంగా పతనమవుతూ వస్తోంది. ప్రస్తుతం రెండు దశాబ్దాల్లో మొదటిసారి యూరో, డాలర్ సమానం అయ్యాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా యురోపియన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని యూరో న్యూస్ పేర్కొంది. నివేదిక ప్రకారం, 1 డాలర్ ఇప్పుడు 1 యూరోతో సమానం అయింది. అంటే వస్తు, సేవల కోసం యురోపియన్ కంపెనీ ఇకపై మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో యురోపియన్ ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో తక్షణమే చౌక కానున్నాయి. ఫిబ్రవరిలో ఒక యూరో విలువ 1.13 డాలర్ ఉండగా, అప్పటి నుంచి యూరో క్షీణిస్తూ వస్తోంది. ఆంక్షలు విధించడం వల్ల యురోపియన్ దేశాలకు రష్యా సరఫరా చేసే గ్యాస్‌ను కట్ చేయవచ్చనే భయాలు నెలకొన్నాయి. దీంతో యూరో పతనమవుతూ వస్తోంది. గతంలో 2002 నవంబర్‌లో యూరో విలువ 0.99 డాలర్లు ఉంది. అప్పటి నుంచి యూరో నిలకడగా పెరుగుతూ ఉంది. అమెరికాలో సంక్షోభం కారణంగా 2008 సంవత్సరంలో యూరో విలువ 1.60 డాలర్లకు చేరింది. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత యురోపియన్ యూనియన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది.

డాలర్‌పై 79.81 వద్ద రూపాయి విలువ

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ విలువ రోజు రోజుకీ క్షీణిస్తూనే ఉంది. బుధవారం నాడు రూపాయి విలువ 22 శాతం పతనమైంది. రికార్డు స్థాయి కనిష్టం 79.81కి చేరింది. యూరోతో పోలిస్తే డాలర్ విలువ 20 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, భారతీయ స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండడం వల్ల రూపాయి విలువ బలహీనపడుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంక్‌లు దూకుడుగా వడ్డీ రేట్లను పెంచనున్నాయనే భయాలతో స్థానిక సంస్థలపై ప్రభావం పడుతోంది.

క్రూడ్ ఆయిల్ బ్రెంట్ 100 డాలర్లకు దిగివస్తుండడం రూపాయికి కాస్త ఊరటనిచ్చే విషయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు పడిపోయింది. దీంతో తొలిసారిగా భారతీయ కరెన్సీ రూ.79.60 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉండడంతో రూపాయి పతనమైంది. కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి రూ.79.60 వద్ద ముగిసింది. ఇక సోమవారం రూపాయి 79.48 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో నిరంతరం విక్రయాలు జరుపుతున్నారు. 2022 ఫిబ్రవరి 23న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.62 వద్ద ఉంది. ఇప్పుడు 80కి చేరువ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 రూపాయల స్థాయి కంటే దిగువకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

40ఏళ్ల గరిష్ఠానికి అమెరికా ద్రవ్యోల్బణం

అమెరికాలో ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతూనే ఉంది. తాజాగా జూన్ నెలలో వినిమయ ధరల సూచీ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకుంది. గత నెలలో 9.1 శాతానికి పెరిగింది. 1981 నవంబర్ తర్వాత తొలిసారి అత్యంత మళ్లీ అంతటి స్థాయికి చేరింది. బుధవారం నాడు అమెరికా ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. గ్యాసోలిన్ ధరలు అత్యధిక స్థాయికి అంటే 1.3 శాతానికి పెరిగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News