Wednesday, May 1, 2024

అంబేడ్కర్ మహావిగ్రహం

- Advertisement -
- Advertisement -

కొత్త సచివాలయం సమీపంలో 11.4 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తున దేశంలోనే అతిపెద్ద బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నాం : మంత్రి కొప్పుల

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున 125 అడుగులతో ఏర్పాటు చేస్తున్నామని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దేశంలోని అంబేద్కర్ విగ్రహాలలో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున కొత్తగా కడుతున్న సచివాలయానికి సమీపంలో సువిశాలమైన 11.4 ఎకరాలలో గొప్పగా ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశం అబ్బురపడే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, పరిసరాలను పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌ను పోలిన పీఠం నిర్మించి,దానిపై 125 అడుగుల విగ్రహాన్ని నిలుపుతామని, దీని మొత్తం ఎత్తు 175 అడుగులు అని వివరించారు. పీఠం నిర్మాణం తయారీకి రాజస్థాన్‌లోని ధోల్ పూర్‌కు చెందిన శాండ్ స్టోన్ ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.146 కోట్ల 50 లక్షల రూపాయలు వెచ్చించి అవసరమైన అన్ని నాణ్యతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మకంగా రూపొందనుందని చెప్పారు. ఇందులో మ్యూజియం, అంబేద్కర్ జీవితచరిత్రలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, ఆయన అధ్యయనం చేసిన, రచించిన, ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలతో కూడిన గ్రంథాలయం ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. అలాగే ధ్యానమందిరం, అంబేద్కర్ జీవిత విశేషాలతో రూపొందించిన లేజర్ షో, సమావేశ మందిరం, క్యాంటీన్, సువిశాలమైన పార్కింగ్, వాష్ రూంలు తదితర ఏర్పాట్లు ఉంటాయని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆత్మ గౌరవం మరింత పెంపొందేలా, భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా ఈ స్పూర్తి కేంద్రం అద్భుతంగా రూపుదాల్చనుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కెసిఆర్ పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠ మరింత పెరుగుతాయని మంత్రి కొప్పుల చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి ఐ.గణపతిరెడ్డి, షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఎండి కరుణాకర్, ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ కంపెనీ డిజైన్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. విగ్రహ నమూనా, ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రి నిశితంగా పరిశీలించారు. కన్సల్టెన్సీ కంపెనీ ప్రతినిధుల నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షకు సంబంధించిన అంశాలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించి టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకోనున్నట్లు చెప్పారు. త్వరలో టెండర్లను పిలిచి ఏడాదిలోగా విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

125 ft Ambedkar statue will setup near Secretariat: Koppula

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News