రాయ్పూర్ : చత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం 27 మంది నక్సల్స్ పోలీస్లకు లొంగి పోయారు. వీరిలో ఐదుగురిపై రూ. లక్ష వంతున నగదు అవార్డులు ఉన్నాయి. మావోయిజ సిద్ధాంతంపై విసుగుచెంది, పోలీస్ల పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయినట్టు వారు తెలిపారు. ఈ ఏడాది జూన్లో పోలీసులు ‘స్వగృహానికి/గ్రామానికి తిరిగి (లాన్ వర్రటు) ’ పేరున పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. ఇది సత్ఫలితాలు అందించింది. ఇంతవరకు 177 మంది నక్సల్స్ లొంగిపోయారని దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ చెప్పారు.
ఇప్పుడు లొంగిపోయిన 27 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరంతా బర్సూర్ పోలీస్ స్టేషన్లో సిఆర్పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని ఎస్పి చెప్పారు. వీరిలో 11 మంద గుఫా గ్రామానికి చెందిన వారు కాగా, ఏడుగురు బెడ్మా, ఐదుగురు మంగ్నార్, ముగ్గురు హితవాడ, మరొకరు హండ్వాడా గ్రామాలకు చెందిన వారు. వీరంతా పోలీస్ బృందాలపై జరిగిన దాడులు, మందుపాతల పేలుడు తదితర సంఘటనలతో ప్రమేయం ఉన్న వారేనని ఎస్పి వివరించారు. తాత్కాలికంగా వీరికి రూ.10 వేలు వంతున పోలీస్ అధికారులు ఆర్థిక సాయం అందించారు.