అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ఏర్పడ్డ భూ ప్రకంపనలకు కచ్ జిల్లాలోని దుదాయ్కు ఉత్తర ఈశాన్యంలో ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రధాన కేంద్రంగా నిలిచింది. గాంధీనగర్లోని భూప్రకంపనల పరిశోధక కేంద్రం (ఐఎస్ఆర్)లో ఈ ప్రకంపనల తీవ్రతను గుర్తించారని అధికార వర్గాలు ప్రకటన వెలువరించాయి. భూమి పొరల్లో 30.5 కిలోమీటర్ల లోతున ఈ తక్కువ స్థాయి భూకంపం సంభవించిందని వివరించారు. బుధవారం సాయంత్రం వరకూ కూడా ఈ భూ వైపరీత్యంతో అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు కానీ నష్టం ఏమైనా సంభవించినట్లు కానీ వార్తలు వెలువడలేదు.
బుధవారం ఉదయం కూడా ఇదే ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూమి కంపించింది. తరువాత మధ్యాహ్నం వచ్చింది అనంతర ప్రకంపన క్రమం అని నిర్థారించారు. తొలి భూకంప ప్రధాన కేంద్రం సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్ జిల్లాలోని లాల్పూర్కు సమీపంలో నెలకొని ఉందని గుర్తించారు. గతంలో గుజరాత్లోని కచ్ ప్రాంతం తీవ్రస్థాయి భూకంపానికి గురై పెను ముప్పును సృష్టించింది.
4.1 magnitude of Earthquake in Gujarat