15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు
33,425కు చేరిన మరణాలు
64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైనాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,83,156కు చేరుకుంది. అయితే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 4,96,988 మంది చికిత్స పొందుతుండగా మరో 9,52,743 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగాఈ మహమ్మారితో కొత్తగా మరో 654 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 33,425కు చేరుకుంది. అయితే జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం మంగళవారం సాయంత్రానికి పాజిటివ్ కేసలు సంఖ్య 15 లక్షలు దాటింది. కాగా దేశంలో ప్రస్తుతం రికవరరీ రేటు 64.25 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.25 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ కేసులు 45 వేలకు పైగా నమోదు కావడం వరసగా ఇది ఆరో రోజు.. కాగా మంగళవారం సంభవించిన 654 మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 227 ఉండడం గమనార్హం. తమిళనాడులో 77 మంది, కర్నాటకలో 75 మంది, ఆంధ్రప్రదేశ్లో 49 మంది, పశ్చిమ బెంగాల్లో 39 మంది, యుపిలో 30 మంది, ఢిల్లీలో 26 మంది కొవిడ్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో కలిపి మహారాష్ట్రలో మరణాల సంఖ్య 13,883కు చేరుకోగా, ఢిల్లీలో 3,853, తమిళనాడులో 2,348, గుజరాత్లో 2,348, కర్నాటకలో 1,953, యుపిలో 1,411, ఎపిలో 1,090కి చేరుకున్నాయి.
47703 New Corona Cases Reported in India