హైదరాబాద్: సిఎఎ కేవలం ముస్లింలకే కాదని.. దేశంలోని పేదలందరికీ వ్యతిరేకమని ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఓవైసి తెలిపారు. సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్ఆర్పికి వ్యతిరేకంగా శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. తాను ఈ దేశ వాసినని, అవసరమైనప్పుడు దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. అందరినీ సమ దృష్టితో చూస్తున్న సిఎం కెసిఆర్ ఉన్న గడ్డమీద పుట్టడం తమ అదృష్టమన్నారు. సిఎఎపై ఇంత ఖరాకండిగా తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ఎన్పిఆర్ తరువాత ఎన్ఆర్సిని తీసుకరావడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని మండిపడ్డారు.
ఏప్రిల్ 1 నుంచి ఎన్సిఆర్ తీసుకరావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ఎన్పిఆర్కు చట్టబద్దతలేదని, తెలంగాణలో ఎన్పిఆర్ను వాయిదా వేయాలని కోరుతున్నామని, పూర్తి వివరాలు అందించామని, వారిని డౌట్పుల్ కేటగిరిలో పెడతారని, డౌట్పుల్ సిటిజన్స్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుందని, పౌరసత్వం పైన ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే ప్రొవిజన్ పెట్టారని, దీని వల్ల బ్లాక్ మెయిలింగ్ కేసులు పెరుగుతాయని, దేశంలో 50 శాతం మందికి సొంత ఇళ్లు లేదని, అద్దె అడ్రస్ వాళ్లకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. ఒకే అడ్రస్పై రెండు, మూడు కుటుంబాలు ఉంటాయని, ఎన్ఆర్సి ముస్లింలకే కాదు..ఎస్సి, బిసి పేద వర్గాలకు వ్యతిరేకమన్నారు. దేశంలో 70 శాతం మందికి బర్త్ సర్టిఫికెట్ లేదన్నారు.