కోల్కతా: స్వాతంత్య్రం తర్వాత చరిత్రను రాసినవారు విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయలేదని, దేశచరిత్రలో అనేక కోణాల్ని చరిత్రకారులు పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి దేశ వారసత్వాన్ని పరిరక్షించుకోవడమని మోడీ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం ముందు మనం మన దేశ వారసత్వ వైభవాన్ని నిలపాలి. భారతదేశం వారసత్వ పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకోవాలి.
దేశంలో దిగ్గజాలనదగిన అయిదు మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం. కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంతోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని ప్రధాని మోడీ తెలిపారు. కోల్కతాలో పునరుద్ధరించిన నాలుగు వారసత్వ భవనాలు ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వేడరె హౌస్, మెట్కాల్ఫ్ హౌస్, విక్టోరియా మెమోరియల్ హాల్లను ప్రధానమంత్రి శనివారం జాతికి అంకితం చేశారు. ‘బ్రిటీష్ హయాంలోను, మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరిత్రకు సంబంధించిన అనేక ముఖ్యమైన అధ్యాయాలను చరిత్రకారులు విస్మరించారు.
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగోర్ 1903లో వెలువరించిన ఒక రచనలో … విద్యార్థులు పరీక్షలకోసం చదివేది మాత్రమే చరిత్ర కాదు…అని తెలిపారు ’ అని మోడీ ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ‘బయటి నుంచి వచ్చిన కొందరు కిరీటంకోసం తమ సొంత బంధువులను, సోదరులనే చంపుకున్నారు. అయితే మన చరిత్ర కాదు. రవీంద్రులవారే ఇది చెప్పారు’ అని కూడా మోడీ గుర్తు చేశారు.