కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఇంటి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించారు. ఈక్రమంలో కాశిం అరెస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. కాశింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ శనివారం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్చేసి గజ్వేల్కు తరలించడంతో పౌరహక్కుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పిటిషన్పై అత్యవసరవిచారణ చేపట్టిన సిజె ఆదేశాల మేరకు ప్రాఫెసర్ కాశింను సిజె ఇంటిముందు హాజరుపరిచారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు. కాశిం తరఫున న్యాయవాదులుగా రఘునాథ్ , చిక్కుడు ప్రభాకర్, భార్య స్నేహాలతను సిజె నివాసంలోకి పోలీసులు అనుమతించారు. ఈక్రమంలో పిటిషనర్ తరఫున సీనియర్న్యాయవాది రఘునాథ్వాదనలు వినిపించారు. విరసం కార్యదర్శిగా ఎన్నికైన కాశింను ఐదేళ్ల నాటి కేసులో ఇపుడు అరెస్టు చేయటం అప్రజాస్వామికమన్నారు. అదేవిధంగా కాశిం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్ చేసిన విధానంపై వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.