కాళేశ్వరం నుంచి 3 లిఫ్ట్ల ద్వారా సాగునీరు
5 మండలాల్లోని 102 గ్రామాలకు చెందిన 367 చెరువులు
నింపే కార్యక్రమం, 1,35,000వేల ఎకరాలకు ప్రాణం
హైదరాబాద్: చెన్నూరు నియోజక వర్గానికి మహర్ధశ పట్టనుంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోని 102 గ్రామాలకు1 లక్ష 35 వేల ఎకరాలకు 367 చెరువులు నింపడానికి కాళేశ్వరం నుండి మూడు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందించడానికి సర్వే ఇన్వెష్టిగేషన్ జి.వో విడుదల చేయడం జరిగింది. ఇందు కోసం రూ.6.88 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిధులతో సాగునీటి అందించడానికి అవసరమైన సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడు లిఫ్టులకు సంబంధించి సమగ్ర సర్వే, పరిశీలన, హైడ్రాలిక్ డిజైన్ల వివరాలు, సిఎం, సిడి పనులకు సంబంధించిన డ్రాయింగ్లు, స్థల సేకరణ షెడ్యూల్డ్, సరిహద్దుల నిర్దారణ, భూసార పరీక్షలు, పంపు హౌజ్ల వ్యయ నివేదిక, ప్రధాన కాలువల నుంచి నీటి సరఫరాకు అవసరమైన మూడు లిఫ్టులకు సంబంధించిన నివ నివేదికను రూపొందిస్తారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్కసుమన్ మాట్లాడుతూ, మూడు లిప్టులతో మంజూరుతో చెన్నూరు నియోజకవర్గానికి జలకళ రానుందన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్కు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక శాశ్వతంగా చెన్నూరు నియోజకావర్గ రైతాంగానికి సాగునీటి విషయంలో శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మందమర్రి ప్రచార సభలో సిఎం కెసిఆర్ చెన్నూరు నియోజకవర్గానికి 1 లక్ష 20 వేలకు పైగా గోదావరి నుండి సాగుజలాలు అందిస్తామని చెప్పిన మాట ఈనాడు అక్షర సత్యమైందన్నారు. జివో విడుదల చేసిన సందర్భాన రైతులు సిఎం కెసిఆర్ను, టిఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టి కాపాడుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.