డేటా కేంద్రాలు 2 ప్రాంతాలు చందన్వల్లి, మీర్ఖాన్పేటలు
రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడి
రూ. 11,624 కోట్లు
మనతెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంలో, ఇ కామర్స్లో దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ కంపనీ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు రూ. 11,624 కోట్ల (1.6 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడితో రెండు డేటా కేంద్రాలను నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగర శివారులో రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెజాన్ సంస్థ ప్రారంభ పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాలపైనే పెట్టనుంది. ఈ రెండు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి సాయం చేయనున్నాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
శంషాబాద్ మండలంలోని చందన్వల్లిలో రెండింటిలో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుండగా, రెండో కేంద్రాన్ని కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట గ్రామంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతం హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంటుంది. డేటా సెంటర్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (ఏడీఎస్ఐపీఎల్) పర్యావరణ అనుమతులు కోరింది. ఈ మేరకు గత నెల 31న నిపుణల కమిటీ (ఎస్ఈఏసీ)కి అవసరమైన పత్రాలు అందజేసింది. ఈ పత్రాల ప్రకారం చందన్వల్లిలో 66,003 చదరపు మీటర్లు, మీర్ఖాన్పేటలో 82,833 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.