హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహం, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటి కంపెనీ క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ తన బ్రాంచ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఫిబ్రవరి 16 న వరంగల్లోని క్వాడ్రంట్ రిసోర్స్ ఐటి డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. మడికొండ ఐటిపార్కులో క్వాడ్రంట్ రిసోర్స్ సెంటర్ ను 1.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఐటి సెంటర్ ద్వారా స్థానికంగా ఉండే ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ప్రముఖ దిగ్గజ కంపెనీలైన టెక్ మహీంద్రా, సైయెంట్ తమ బ్రాంచీలను వరంగల్ లో ఏర్పాటుచేశాయి. క్వాడ్రంట్ వ్యవస్థాపకుడు, సిఒవొ వంశీరెడ్డికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
KTR inaugurate quadrant resource center at Warangal