పూనే : కరోనా జన్యు విశ్లేషణలో భారతీయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకోనున్నారు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా (జిఐఎస్ఐఎడి) లో తాము పాలుపంచుకుని రెండు జన్యు విశ్లేషణ డేటా సేకరిస్తామని పుణె కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ వైరాలజీ సంస్థ వెల్లడించింది. ఈమేరకు జెన్బ్యాంకుతో కలసి పనిచేస్తుంది. కేరళ లోని వైరస్ బాధితులు ఇద్దరి నుంచి జెన్బ్యాంకు నమూనాలు సేకరించింది. వైరస్ జన్యు విశ్లేషణ అధ్యయనం చేయడం వల్ల వైరస్ ఎక్కడ నుంచి ఎలా వ్యాపించిందో తెలుస్తుంది. ఉదాహరణకు కరోనా బాధితుడైన భారతీయుని జన్యునమూనాను విశ్లేషించడం వల్ల ఈ వైరస్ వుహాన్ నుంచి వచ్చిందా లేక మరే దేశం నుంచి వచ్చిందా తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతవరకు భారత్తో సహా 26 దేశాలు ఈవైరస్ జన్యు విశ్లేషణలో పాలుపంచుకుంటున్నాయి. చైనా 70 జన్యు విశ్లేషణలు చేపట్టగా, అమెరికా 22, ఆస్ట్రేలియా, జపాన్ చెరో 10, సింగపూర్, దక్షిణ కొరియా చెరో ఎనిమిది, నేపాల్, వియత్నాం, కాంబోడియా ఒక్కొక్కటి వంతున జన్యు విశ్లేషణలు చేపట్టాయి.