సామాజిక ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రానున్న రెండు వారాల్లో అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల సుమారు 2 లక్షల మంది అమెరికన్లు చనిపోయే ప్రామాదం ఉందని వైట్ హౌజ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఎంతలా అంటే.. ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన ఇటలీనే దాటేసి అమెరికా దూసుకుపోతోంది. అమెరికాలో ఇప్పటి వరకు లక్షా 42 వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే అమెరికాలో 18,300 కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ సోకి అమెరికాలో 2,472 మంది మృతి చెందారు. ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య 97,690కి చేరగా.. మృతుల సంఖ్య 10,779కి చేరింది. స్పెయిన్ లోనూ కరోనా వేగంగా వ్యాప్తిచెందుతుంది. స్పెయిన్ లో ఇప్పటి వరకు 80,110 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 6,803 మంది మరణించారు. ఇక, ఈ వైరస్ పుట్టిన దేశమైన చైనాలో బాధితుల సంఖ్య 81,439కి చేరగా.. మృతుల సంఖ్య 3,300లకు చేరింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,23,328కి చేరగా.. 34 వేల మంది మరణించారు.
Trump Extends Social Distance until April 30 in US