ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్యవసాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కొంత ప్రతిష్టంభన ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడి గ్రామాల్లో అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మక్కలు, వరి విస్తారంగా పండిందని, అందుకు అనుగుణంగా గతంలో ఉన్న 96 కొనుగోలు కేంద్రాలను 444కు పెంచామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, పండించిన చివరి గింజ వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయం రంగం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో మళ్లీ పునరుత్తేజం పొందిందన్నారు. అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తద్వారానే అభివృద్ధి సాధించగలమని మంత్రి పువ్వాడ అన్నారు.
Minister Puvvada Inaugurates Paddy Procurement Centers