ముంబై : ముంబైకి సమీపాన ప్రఖ్యాత బీచ్గా పేరుపొందిన అలిబౌగ్ లో వైద్యసదుపాయాలు చాలా తక్కువ. వెంటిలేటర్లు లేక చాలామంది రోగులను ఇక్కడ నుంచి ముంబై ఆస్పత్రులకు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిబౌగ్ నివాసి శ్వేతాపాటిల్కు శుక్రవారం తెల్లవారు జామున ప్రసవ వేదన ఎక్కువ కావడంతో భర్త కేతన్ సమీపాన గల నర్సిగ్హోమ్కు తీసుకెళ్లారు. ఈ దంపతులకు ఇదివరకే మొదటి సంతానంలో పుట్టిన కొన్ని గంటల్లో బిడ్డ చనిపోయింది. ఆ అనుభవం దృష్టా సకాలంలో సరైన వైద్యం అందాలనే ఆకాంక్షతో వారున్నారు.
శ్వేత డయాబెటిక్ రోగి. సుగర్ స్థాయిలు అదుపులో ఉండేందుకు ఆమె సరైన వైద్యం చేయించుకోవలసి ఉంటుంది. ఆమె వైద్య చరిత్ర మొదటి నుంచి తెలిసిన గైనకాలజిస్టు నియోనాటాలజిస్టు, పిల్లల డాక్టర్ అయిన రాజేంద్ర చందోర్కర్ సహాయం తీసుకున్నాడు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా 3.1 కిలోల బరువు గల మగ బిడ్డ పుట్టాడు. అయితే శ్వాస సమస్యలు తీవ్రమై బిడ్డ నీలిరంగుగా మారడంతో బిడ్డకు అత్యవసర నియోనాటల్ కేర్ అవసరమైంది. లాక్డౌన్ వల్ల రవాణా లేక పోవడంతో 1.5 కిమీ దూరంలో ఉన్న చందోర్కర్ ఆస్పత్రికి టువీలర్పై డాక్టర్ తీసుకెళ్లవలసి వచ్చింది. ఆక్సిజన్ అందించడంతో 12 గంటల తరువాత బిడ్డ ఆరోగ్యం నిలకడ అయింది.