ఏడాదిలో 101 మంది మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా పింజోరా ఏరియాలో సోమవారం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. పింజోరా ఏరియాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అది ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్కు దారి తీసిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. మృతులు ఏ ఉగ్రవాద గ్రూపుకు చెందిన వారో వారి వివరాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. గత 24 గంటల్లో షోపియాన్ జిల్లాలో ఇది రెండవ ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్తో కలిపి మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులను గత 24 గంటల్లో సైన్యం అంతమొందించింది. జమ్ము కశ్మీర్లో ఈ ఏడాది మొత్తం 101 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించ గలిగాయి. విదేశీ ఉగ్రవాదులు 25 మందితోసహా మరో 125 మంది ఉగ్రవాదులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కశ్మీర్లో వందమంది స్థానిక ఉగ్రవాదులుతోపాటు మరో 25 మంది విదేశీ ఉగ్రవాదులు చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నారని లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు చెప్పారు.