ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
ఆయుర్వేద పద్ధతిలో ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా తయారీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పామ్ నీరా, పామ్ ప్రొడక్ట్ రీసెర్చ్ ఫౌండేషన్, వేద ఫామ్ ప్రొడక్ట్ తయారు చేసిన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్లను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గీత వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. నీరా పాలసీతో సాంప్రదాయకంగా తాటి, ఈత చెట్ల నుంచి తీసిన నీరా ద్వారా సేంద్రియ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్లను తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆయుర్వేద పద్దతిలో తయారు చేస్తున్నరన్నారు. నీరా ఉత్పత్తులతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
వీటితో పాటు మలబద్ధకం, కాల్షియం, పోటాషియంతోపాటు ఐరస్, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను నివారిస్తుందన్నారు. వీటితో పాటు తాటి బెల్లం, తాటి, ఈత సిరప్లలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయన్నారు. నీరాలో మైగ్రెన్ బరువు తగ్గడంలోనే, శరీరంలో నెలకొన్న వేడితత్తాన్ని తొలగించడంలోనూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రవేత్తలు సైతం తమ పరిశోధనల్లో ఈ విషయాలను వెల్లడించారన్నారు. నీరా బై ప్రొడక్ట్లను తయారు చేయడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్ననీరా కేంద్రానికి టెండర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్రావు గౌడ్, అంబాల నారాయణగౌడ్, వింజమూరి సత్యం గౌడ్, భాను చందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.