ఎపిలో 10,080 కరోనా కేసులు.. ఒక్కరోజే 97మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎపిలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 97 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే ప్రథమం. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 14 మంది చనిపోగా, అనంతపురం జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు ఎపిలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,939కి చేరుకుంది. ఇక, పాజిటివ్ కేసుల ఉదృ్ధతి కూడా ఏమాత్రం తగ్గలేదు. మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. కాగా తాజాగా 9,151 మందిని డిశ్చార్జి చేశారు.
ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,29,615 కాగా, ఇంకా, 85,486 మంది చికిత్స పొందుతున్నారు.ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,080 మందికి పాజిటివ్గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 24,24,393కి చేరిందని, కొత్తగా 10,080 మందికి పాజిటివ్గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 2,17,040కి చేరాయని తెలిపారు. ఎపి రాష్ట్రంలో ప్రస్తుతం 85,486 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
97 People die with Corona in a Single day in AP