జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిబిఐ కోర్టులో ఎ-1గా ఉన్న ఎపి సిఎం జగన్ బెయిల్ను రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఎ1గా ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు రఘురామ తెలిపారు. ఈక్రమంలో ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మంగళవారం ఎంపి రఘురామ మాట్లాడుతూ ఎన్ని ఛార్జిషీట్లు వేసినప్పటికీ కేసులకు సంబంధించిన ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందన్నారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశానన్నారు. త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని ఎంపి రఘురామ సలహాఇచ్చారు.