కోర్టు విచారణలో అంగీకరించిన ట్విటర్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటి నిబంధనలను ఇంకా తాము అమలు చేయలేదని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ ఢిల్లీ హైకోర్టుకు మంగళవారం తెలియచేసింది. అయితే కొత్త నిబంధనలకు అనుగుణంగా అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. ట్విటర్ నిబంధనలను పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్ ఆచార్య పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ట్విటర్ నిబంధనలను ధిక్కారించాలని అనుకుంటోందా అని ప్రశ్నించగా దానికి ట్విటర్ పై విధంగా బదులిచ్చింది. ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించగా ఆయన రాజీనామా చేశారని కొత్త గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సి ఉందని ప్రస్తుతం నియామక ప్రక్రియ జరుగుతోందని ట్విటర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియచేశారు. దీనిపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేస్తూ నియామక ప్రక్రియకు మీకు నచ్చినన్ని రోజులు తీసుకుంటామంటే కుదరదని, దీనికి న్యాయస్థానం అంగీకరించదని జస్టిస్ రేఖావల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నపై స్పందించడానికి తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని ట్విటర్ కోర్టును కోరింది. అయితే అప్పటిదాకా ట్విటర్కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కంపెనీపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని తెలియచేసింది.