రాష్ట్రాలు యుటిలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: అనాధలు, నిరాశ్రయులు, యాచకులు, దేశదిమ్మరులకు కోవిడ్ టీకాలపై ప్రత్యేక దృష్టి దిశలో కేంద్రం చొరవ తీసుకుంది. వీరికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ల కార్యక్రమం చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యుటి)లకు సూచనలు సలహాలు వెలువరించింది. ఇటువంటి వారు తమంత తాముగా వ్యాక్సిన్ల కోసం నమోదు చేసుకునే వీలు లేని స్థితి ఉంది. వారికి టీకాలకు సరైన వనరులుకూడా లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు, యుటిలు వెంటనే ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. వారికి వ్యాక్సినేషన్లు పూర్తి చేయాలనిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, యుటిల పరిపాలనా అధికారులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్భూషణ్ లేఖలు పంపించారు. ఈ దిశలో స్వచ్ఛంద సేవాసంస్థలు, పౌర సంస్థలు, కార్యకర్తలు, చైతన్యవంతులైన పౌరుల సహకారం తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కోట్ల డోసుల టీకాలు వేశారు. వ్యాక్సిన్లు వేసుకోలేనిస్థితిలో ఉన్న వారిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. అణగారిన వర్గాలకు టీకాలు వేయించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని కేంద్రం అభిప్రాయపడింది.
Central government Focus on Covid-19 vaccines