కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: జెఇఇ మెయిన్స్ పరీక్ష అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో ఏడుగురు వ్యక్తులను సిబిఐ అరెస్టు చేసిన దరిమిలా ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసింది. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాల్సిన బాధ్యత విద్యా శాఖకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ)కి ఉందని, ఈ ఆరోపణలకు ఈ సంస్థలను ఇప్పటివరకు ఎందుకు బాధ్యుల్ని చేయలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై సోమవారం(సెప్టెంబర్ 6) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు కాగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబ, ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్టిఎ నిర్వహించిన ఇతర పరీక్షలలో అక్రమాలు జరగలేదని విద్యార్థులు ఎలా నమ్మగలరని ప్రశ్నించారు. జెఇఇ లాంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలనే ఈ అక్రమాలు వదల్లేదంటే భవిష్యత్తులో మంచి వృత్తి నిపుణులు ఎలా తయారుకాగలరని వారు ఆవేదన వ్యక్తం చేశారు.