Tuesday, May 21, 2024

ఎపిలో సంక్షేమ పథకాల నగదు జమపై హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమపై ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం చెప్పిన విధంగానే పోలింగ్ తర్వాతే నగదు జమ చేసుకోవాలని తెలిపింది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఈ నెల 14న జమ చేసుకోవచ్చని గతంలో ఇసి ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కాగా, శుక్రవారం ఒక్క రోజు నగదు బదిలీ చేసేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై.. డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, ఆ తర్వాత రోజు నుంచి డిబిటి ద్వారా నగదు బదిలీ చేసుకోవాలన్న ఇసి ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టపర్చింది.

కాగా, శుక్రవారం ఒక్కరోజు డిబిటి ద్వారా నగదు జమ చేయడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వగా, దీనిపై డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ పాత పథకాలే తప్ప కొత్తవి కాదని, వాటికి సంబంధించిన నగదునే ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని చూస్తున్నామని వెల్లడించారు. దీనిపై సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకూ ఇసి క్లారిటీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఇంకా తాము నిధులు విడుదల చేయలేదన్నారు. గతంలో 2019లో పసుపు కుంకుమ కోసం పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం ఇసి ఆదేశాలనే సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో, ఈ నెల 14నే సంక్షేమ పథకాల నిధులు విడుదల కానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజు నగదు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలివ్వగా, దీనిపై ఇసి ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటివరకూ నగదు ఇవ్వని మీకు ఇప్పుడు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చింది? అని లేఖలో ప్రశ్నించింది. ’బటన్ నొక్కి చాలా రోజులైనా ఇప్పటివరకూ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు ఎందుకు జమ చేయలేకపోయారు.?, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ డిబిటిలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.?, ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెప్తారు?, ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా.?, లెవెల్ ప్లేయింగ్ ఫీల్ దెబ్బతినదా..?, గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలకు నిధుల బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి.

ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైంది..?. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారా వివరణ ఇవ్వండి..? ఈ రోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటి.?, సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ముందుగా తెలియదా?. పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందర ఏం వచ్చింది..?, ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించండి.’ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లడించింది. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News