న్యూఢిల్లీ: కరోనాపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తూ భారత్ మరో రెండు టీకాలను ఆమోదించింది. కొవొవ్యాక్స్, కార్బివాక్స్ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది. అలాగే యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరివిర్ను అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించేలా అనుమతులు మంజూరు చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (పుణె) తయారు చేసిన కొవొవాక్స్కు బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బివాక్స్కు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీవొ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరు లోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. బ్రిటన్, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్ పరీక్షల ఫలితాల డేటాను జతచేసింది. ఈ క్రమం లోనే సీడీఎస్సీవొ నిపుణుల బృందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్కు అనుమతినిచ్చింది. కొవిడ్ వ్యాధికి మోల్నుపిరవిర్ ఔషధం అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించింది. మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరఫ్యూటిక్స్ సంయుక్తంగా ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. ఇప్పుడు భారత్లో ఈ ఔషధాన్ని 13 సంస్థలు తయారు చేస్తాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్తో బాధపడుతున్న వయోజనులు, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తారని తెలిపారు.
India Approves 2 more Corona vaccines