కాళ్ళపారాణి ఆరక ముందే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.. వివరాలలోకి వెళితే..జిల్లాలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిలకు ఈనెల 6వ తేదీన చిరుత రాజు అనే అబ్బాయితో వివాహం జరిగింది. శుక్రవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి భర్తతో కలిసి వచ్చింది. పరీక్ష ముగిసిన అనంతరం భర్తతో కలిసి బైక్పై కరీంనగర్ వైపు వెళ్తున్న క్రమంలో బైక్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముద్దసాని అఖిల(22) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, భర్త రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.