Friday, September 26, 2025

ఏయూలో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని, వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న విజయమూరి వెంకట సాయి మణికంఠ (25) గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో శాతవాహన హాస్టల్ బాత్రూంలో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత మణికంఠ తనకు ఊపిరి ఆడటం లేదని చెప్పగా, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో లేదని సిబ్బంది చెప్పినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అనంతరం విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కెజిహెచ్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కెజిహెచ్ వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఉదయం 10 గంటల నుంచి ఏయూ ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి, డిస్పెన్సరీని ఆధునీకరించి, వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ విసి తన పదవికి రాజీనామా చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులు రాత్రి వరకు పాల్గొని, మృతుడికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News