Monday, April 29, 2024

అత్యంత నమ్మకమైంది ఆధార్

- Advertisement -
- Advertisement -

ఎలాంటి ఆధారాలు లేకుండా మూడీస్ నివేదిక
నివేదికను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఆధార్ కార్డు భారతదేశం ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. అయితే తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ ఆధార్ విశ్వసనీమైనది కాదంటూ నివేదిక విడుదల చేసింది. ఈ ఆరోపణలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) తోసిపుచ్చింది. ఆధార్ కార్డును ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ గుర్తింపు కార్డుగా యుఐడిఎఐ అభివర్ణించింది. మూడీస్ ఇన్వెస్టర్స్ విడుదల చేసిన తన నివేదికలో ఆధార్‌తో వ్యక్తుల భద్రత, గోప్యత ఆందోళనకరమని పేర్కొంది.

ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని ప్రస్తావిస్తూ భారతదేశం వంటి వాతావరణంలో ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థను విశ్వసించలేమని నివేదిక పేర్కొంది. కొన్నిసార్లు ఇది సరిగ్గా పని చేయదు, దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. మూడీస్ వాదన నిరాధారమని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ నివేదికను రూపొందించారని పేర్కొంటూ ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ సోమవారం సెప్టెంబర్ 25న ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలోని 100 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని విశ్వసిస్తున్నారని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆధార్ సిస్టమ్‌లో ముఖం, కళ్ల ద్వారా కాంటాక్ట్‌లెస్ బయోమెట్రిక్‌ల ద్వారా ధృవీకరణ జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఇది కాకుండా మొబైల్ ఒటిపి ద్వారా కూడా ఆధార్‌ని ధృవీకరించవచ్చని, మూడీస్ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని ప్రభుత్వం తెలిపింది. డబ్బు నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. వారు తమ ఆధార్ నంబర్‌ను ఎంఎన్‌ఆర్‌ఇజిఎ డేటాబేస్‌కు జోడించడానికి బయోమెట్రిక్‌లను అందించాల్సిన అవసరం లేదు. మూడీస్ నివేదికలో ఎలాంటి డేటా లేదా పరిశోధనను పేర్కొనలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు జారీ చేసిన ఆధార్ కార్డుల సంఖ్య యుఐడిఎఐ వెబ్‌సైట్‌లో ఉంది, అయితే నివేదికలో వాటి సంఖ్య 120 కోట్లుగా పేర్కొంది. ఈ గణాంకాలు తప్పు అని ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు ఆధార్ కార్డ్‌ను ప్రశంసించాయి. భారతదేశం తరహాలో ఇతర దేశాలు డిజిటల్ ఐడి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News