Sunday, April 28, 2024

క్షేత్రస్థాయిలో బిఆర్‌ఎస్ జెండా అజెండా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో తెలంగాణ వేదికగా బయలుదేరిన భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించిన విధి విధానాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. దాంతో బిఆర్‌ఎస్‌లో చేరడానికి దేశ వ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున ఉత్సాహం చూపుతున్నారు. ఈ దిశగా పలు రాష్ట్రాల నుంచి ఇప్పటికే వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా సిఎం కెసిఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధినేత సూచనలు సలహాలతో బిఆర్‌ఎస్‌లో పెద్ద సంఖ్యలో చేరేందుకు తమ అనుచరులు, శ్రేయోభిలాషులతో సమాలోచనలు జరిపి త్వరలోనే చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలాగే కెసిఆర్ సూచనల మేరకు బిఆర్‌ఎస్ పార్టీ జెండాను, ఎజెండాను వారి వారి రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో తమ ప్రజల్లోకి తీసుకవెళ్ళడానికి అవసరమైన కార్యాచరణను కూడా ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు బిసి కులాల నేతలు, రాజకీయ నాయకులు కెసిఆర్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల మాజీ చైర్మన్, బిసిఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బిసి కుల సంఘాల నాయకులు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. బిఆర్‌ఎస్‌లో చేరడానికి తమకు అవకాశమివ్వాలని కెసిఆర్‌ను కోరారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో కెసిఆర్ నడిపిస్తున్న తీరు…. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల అభివృద్ధి,ం సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, అవి సాధిస్తున్న ఘన విజయాలు కేవలం ఆంధ్రా ప్రజలనే కాకుండా యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తెలంగాణ మాదిరిగానే ఎపిని కూడా ప్రగతి పథంలో నడిపించగల సత్తా సిఎం కెసిఆర్‌కు ఉన్నదని తాము భావిస్తున్నామన్నారు. తెలంగాణలో కెసిఆర్ పాలన, ఎపికు చెందిన బడుగు బలహీన వర్గాల్లో ఒక కొత్త ఆశను రేకిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమకూ అవకాశమిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, నియోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ భేటీలో వారు కెసిఆర్‌కు వివరించారు. కాగా వారి ప్రతిపాదనకు కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో గురిపర్తి రామకృష్ణ యాదవ తో పాటు ఆంధ్రప్రదేశ్ పద్మశాలీల సంఘం రాష్ట్ర నాయకులు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు, సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, బిసి సంఘం నేత రామనాథం అంజన్‌రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News