Sunday, April 28, 2024

ఎపిలో ఉన్మాదికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Accused sentenced to death in Ramya murder case

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బిటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్యకేసులో శుక్రవారం నాడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బిటెక్ విద్యార్థిని రమ్య ను సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో వేధించాడు. అతని వేధింపులు భరించలేని రమ్య శశికృష్ణ ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో శశికృష్ణ కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సిసి కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో డిఎస్‌పి రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సిసిటివి వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు పరిశీలించి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు.

సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తిచేసి కోర్టు తీర్పునిచ్చింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్‌పి తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు.

ఇది జరిగింది 

తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

పోలీసులకు సిఎం అభినందనలు 

ప్రేమోన్మాదికి ఉరిశిక్ష విధించడంపై ఎపి సిఎం జగన్ స్పందించారు. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నానని వెల్లడించారు. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసిందని కితాబిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు అంటూ సిఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు 

శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని, హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదని, వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదన్నారు. రమ్య తల్లిదండ్రులకు తానేమీ చెప్పలేనని, మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?అని పేర్కొంది. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడని, ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని శశికృష్ణ తల్లి భూలక్ష్మివాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News