Tuesday, May 7, 2024

పంటల సాగుకు సరిపడా ఎరువులు

- Advertisement -
- Advertisement -
ఈ సీజన్ వర్షపాతంలో 20 శాతమే లోటు
ఈ ఏడాది రుణమాఫీకి రూ.6385 కోట్లు
5,42,635మంది రైతులకు రుణవిముక్తి
వ్యవసాయశాఖ వెల్లడి

హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగుకు తగ్గట్టుగా అన్ని రకాల రసాయనిక ఎరువులు సమృద్దిగా ఉన్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. సోమవారం ఆ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఖరీఫ్ సీజన్‌పై ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. నేల ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో పచ్చిరోట్టె ఎరువులకోసం రూ.66.81కోట్లు సబ్సిడిగా భరించి 1,27, 126క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 196మి.మి వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. ఇది సాధారణ వర్షపాతంతో పోల్చితే కేవలం 20శాతం మాత్రమే లోటుగా పేర్కొన్నారు. ఐఎండి ప్రకారం మైనస్ 19శాతం నుంచి ప్లస్19శాతం వరకూ సాధారణ వర్షపాతంగానే పరిగణించాల్సివుంటుందని తెలిపారు. ఈ నెల 2న నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారలుతో అన్ని అంశాలు సమీక్షించి తగిన సూచనలు చేసినట్టు తెలిపారు.

రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వర్షాధార ప్రాంతాల్లో శాస్త్రవేత్తల సూచన ప్రకారం పత్తి, కంది , మొక్కజొన్న ,అముదం వంటి పంటలు విత్తుకునేందుకు ఇంకా సమయం ఉందని తెలిపారు. రైతువేదికల ద్వారా కరపత్రాల ద్వారా రైతులకు అన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి వర్షాకాల యాజమాన్య పద్దతులు , సలహాలు అందజేస్తున్నట్టు తెలిపారు.
రుణమాఫీకి రూ.6385కోట్లు
ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణమాఫీకి రూ.6385కోట్లు బడ్జెట్‌లో పొందు పరిచినట్టు తెలిపారు. 2018 నుంచి రుణమాఫీకింద ఇప్పటివరకూ 120.37 కోట్లు 5,42,635మంది రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. రైతుబంధు కింద హోల్డ్‌లో 20లక్షల రైతుల ఖాతాలు ఉన్నట్టు తన దృష్టికి రాలేదని రఘునందన్‌రావు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ద్వారా అన్ని బ్యాంకులకు రుణాల పంపిణీ చేయాలని , రెన్యూవల్ చేయాలని సూచించినట్టు తెలిపారు.

రైతుబంధు నగదును రైతుల ఖాతాల నుంచి వారి రుణాలకు జమ చేయవద్దని అన్ని బ్యాంకులను ఎస్‌ఎల్‌బిసి ద్వారా కోరినట్టు తెలిపారు. జివో నెంబర్ 148ప్రకారం 2018డిసెంబర్ 11నాటికి పంట రుణ బకాయిలు ఉన్న రైతులు రుణమాఫీ పధకానికి అర్హులని తెలిపారు. వారికి వడ్డీ , అసలు కలిపి లక్ష రూపాయల వరకూ మాఫీ జరుగుతుందన్నారు. గతంలోనే ప్రభుత్వం రైతుల రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని ప్రకటించిందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి వారి నగదును వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. రుణ నిబంధనల ప్రకారం ప్రతి రైతు సంవత్సర కాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని కోరామన్నారు. ఎస్‌ఎల్‌బిసి ద్వారా బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేసి రైతులకు వెన్నదన్నుగా నిలవాలని ప్రభుత్వ కోరిందని రఘునదన్‌రావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News