Saturday, April 27, 2024

భూమికి వీడ్కోలు చెప్పిన ఆదిత్య ఎల్ 1.. సూర్యుడి వైపుగా ప్రయాణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చేపట్టిన తొలిమిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదోసారి భూ కక్ష పెంపును విజయవంతంగా నిర్వహించగలిగారు. సోమవారం అర్ధరాత్రి దాటాక వాహక నౌక లగ్రాంజ్ పాయింట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్షను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్షను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు.

దీనిని సూర్యుడి దిశగా ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ 1 దిశలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. దీనికి సంబంధించి తాజాగా ఎక్స్ (ట్విటర్) లో ఇస్రో ఓ పోస్ట్ చేసింది. ట్రాన్స్ లంగ్రేజియన్ పాయింట్‌లో విజయవంతంగా ప్రవేశ పెట్టినట్టు పేర్కొంది. తద్వారా ఆదిత్య ఎల్ 1 భూ ప్రదక్షిణ దిశ ముగించుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది.

బెంగళూరు లోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదే విధంగా మారిషస్, పోర్ట్‌బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూకక్ష పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 శాటిలైట్ 256 కిమీ x121973 కిమీ కక్ష లోకి ప్రవేశించినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి నిర్దేశిత ఎల్1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News