Friday, May 3, 2024

మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం హర్షనీయం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని, బిల్లు విషయంలో బిజెపికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిది. 1975లోనే లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరితో మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోవడం లేదన్నారు. వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదన్నారు.

ఆ తరువాత వాజ్ పేయి ప్రభుత్వం మరో మూడుసార్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్, మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల ఆమోదానికి నోచుకోలేకపోయింది. యూపిఎ ఛైర్ పర్సన్‌గా పదేళ్ల పాటు పనిచేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ పార్లమెంట్‌లో ఆ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఆమోదించలేక పోయిందంటే కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ లో పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నందున మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయం. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించినా బిల్లును అడ్డుకోవడం అసాధ్యం అన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ మహిళా ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News