Tuesday, April 30, 2024

మంకీపాక్స్ వెనుక అమెరికా హస్తం!

- Advertisement -
- Advertisement -

We should be concerned about monkeypox cases

ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి.ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపథ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా, అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

వరియోలా మేజర్, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గత శతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవైకోట్ల మందిని బలితీసుకుందని అంచనా. 16 శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్ పాక్స్ అని పిలిచారు. 1980 లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.

కరోనా, ఉక్రెయిన్ సంక్షోభం, మంకీపాక్స్ నుంచి ప్రపంచం గట్టిసవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రపంచ ఆర్యో సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోవ్‌ు గెబ్రియోసస్ జెనీవాలో జరిగిన సమావేశంలో చెప్పారు. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 15 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్ధారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధంలేనప్పటికీ ఇన్నిచోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్ చెప్పారు.ఇది మసూచి సంబంధిత వైరస్ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరో శాస్త్రవేత్త జే హూపర్ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకినవారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్నివారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్ అంటున్నారు. ఇది ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీచెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.

మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది. మానవుల్లో తొలి కేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్ధతుల్లో, రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్ సోకుతుంది. సంభోగం ద్వారా కూడా సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి, దద్దుర్లు, గాయాలు కావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కావ్‌ులో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు “అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు. యాంటీ వైరల్ వ్యాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌ పాక్స్(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టే విధంగా మార్చవచ్చని 2003 నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.

ఐరోపాలో స్మాల్‌పాక్స్, మంకీపాక్స్, కౌపాక్స్ చికిత్సకు “టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు. దాన్ని టిపాక్స్ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు. తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు. బిల్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్ గేట్స్ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వ్యాక్సిన్ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్ద మనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు.

ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం, నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్ గేట్స్ టెడ్ టాక్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరు నెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్ధం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌గేట్స్ మాటలను బట్టి గేట్స్ అప్పటికే మైక్రోచిప్ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్ధిలేని మాటలని తమ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.

ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయోప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆగ్నేయఆసియా, మాజీ సోవియట్ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్ అనే ప్రాంతంలో ఫోర్డ్ డెట్రిక్ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు.గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఎ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 1346లో జెనోయీస్ -తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్ డే ముసిస్ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకువెళ్లారు.ప్లేగు వ్యాధిగ్రస్థులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్, అంతరాక్స్ వంటి వ్యాధులను వ్యాపింప చేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22 సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్ ఏజంట్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. మొదటి ప్రపంచ యుద్ధం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదులు ఆపరేషన్ చెర్రీ బ్లూసవ్‌‌సు పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. జపాన్ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడు వేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది.

వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్, మంగోలియా, అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ యుద్ధ ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942 నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్ధాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు. వారి ఎత్తుగడ వారినే ఎదురు తన్నవచ్చు. ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News