Sunday, April 28, 2024

ప్రతిపక్ష భేటీపై అమిత్ షా చురకలు

- Advertisement -
- Advertisement -

జమ్మూ : పాట్నాలో ప్రతిపక్ష భేటీ కేవలం ఫోటోసెషన్‌గా సాగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నేతలు ఓ వేదిక దొరికిచ్చుకుని, గుంపుగా ఫోటోలుదిగడానికి ఇది ఉపయోగపడిందని చమత్కరించారు. తలోదిక్కుల ప్రతిపక్ష ఐక్యత దాదాపు అసాధ్యం అని, ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని జమ్మూలో శుక్రవారం ఆయన ఓ ర్యాలీలో మాట్లాడుతూ చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కుదరదని, లోక్‌సభ ఎన్నికలలో ఇప్పటిలాగానే వారు చతికిల పడుతారని తెలిపారు. రాహుల్ గాంధీకి ప్రతి విషయంపై విమర్శలకు దిగడం అలవాటు అయిందని తెలిపారు. రాహుల్ బాబా దేనిని ఔననే వ్యక్తి కాదని, ఆర్టికల్ 370 రద్దు, రామాలయానికి పునాది రాయి,

నిర్మాణం, ట్రిపుల్ తలాక్ ఈ విధంగా దేనినైనా విమర్శిస్తూ ఉంటారని తెలిపిన షా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మోడీకి పోటీగా ప్రధాని పీఠం కోసం తలపడేలా ఉన్నారని, అయితే ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలనేది బాగా తెలుసునని చెప్పారు. పాట్నాలో ఒక్కచోట చేరిన ప్రతిపక్ష నేతలు కేవలం ఫోటోలకు పరిమితం అయ్యి , ఎవరి దారి వారు వెతుక్కుంటారని, వీరు పాట్నాసభలో చేరి తాము లోక్‌సభ ఎన్నికలలో మోడీకి, ఎన్‌డిఎకు సవాలు విసురుతామని ప్రకటించారని, ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో మోడీ 300కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన గురించి ప్రస్తావిస్తూ, పలు రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరాయని, ప్రత్యేకించి అంతరిక్షం, రక్షణ,సెమికండక్టర్ల విషయంలో ఒప్పందాలు ఇరుదేశాల మధ్య బంధంలో మైలురాళ్లుగా నిలుస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News