న్యూఢిల్లీ: తమ బ్యాంకు ఖాతాలను భారత ప్రభుత్వం స్తంభింపచేయడంతో భారతదేశంలో తమ కార్యకలాపాలన్నిటినీ నిలిపివేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మంగళవారం ప్రకటించింది. నిరాధార, దురుద్దేశపూరిత ఆరోపణలను ఆధారం చేసుకుని భారత ప్రభుత్వం తమపై నిరంతర వేధింపులకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది. భారతదేశంలో పనిచేసే సిబ్బందికి ఉద్వాసన పలికి తమ ప్రచారాన్ని, పరిశోధనా పనులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమ్నెస్టీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన దేశంలోని తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ భారత ప్రభుత్వం స్తంభింపచేసిందని, దీంతో తమ కార్యకలాపాలు నిలిచిపోయాయని సంస్థ తెలిపింది. ఆమ్నెస్టీ ఇండియాతోపాటు ఇతర మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు, హక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వం జరుపుతున్న దాడులకు ఇది కొనసాగింపు మాత్రమేనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత చర్యలలో ఇది కూడా భాగమని ఆమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. కాగా, ప్రభుత్వం మాత్రం ఆమ్నెస్టీకు చట్టవిరుద్ధంగా విదేశీ నిధులు అందుతున్నాయని తెలిపింది.
Amnesty ceases operations in India