సేవల నిర్వహణకు పూజారుల కొరత..!!
పూరి : ఒడిషాలోని పూరి జగన్నాథాలయంలో 351మంది సేవకులు, 53మంది ఉద్యోగులు ఆగస్టు నుంచి కరోనా బారినపడ్డారని ఆ ఆలయ అధికారి అజయ్జెనా వెల్లడించారు. వీరంతా(404మంది) ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారనిఆయన తెలిపారు. సేవకులు అధిక సంఖ్యలో హోం ఐసోలేషన్కి వెళ్లడంతో రోజువారీ సంప్రదాయిక పూజలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని ఆయన తెలిపారు. పూజల నిర్వహణలో సంప్రదాయాలు తెలిసిన సేవకులకొరత ఉన్నదని ఆయన తెలిపారు. కోవిడ్19 వల్ల ఈ ఏడాది మార్చి నుంచి జగన్నాథాలయంలోకి భక్తుల ప్రవేశానికి అనుమతి లేదు. అయితే, అందుబాటులో ఉన్న సేవకులతో పూజలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ ఆ ఆలయంలో ఓ పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి శుభద్రకు 13 మంది చొప్పున పూజలు నిర్వహించాలి. అంటే మొత్తం 39మంది పూజారులు అవసరం. ఆయా పూజల్లో ఏ ఒక్కటి జరగకపోయినా, మిగతావి కూడా నిలిపి వేయాలి. దీంతో,మరికొంతమందికి పూజల నిర్వహణలో శిక్షణ ఇప్పించాలని అధికారులు యోచిస్తున్నారు.