నలుగురు నిందితులకు రిమాండ్
పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గురూజీ పరారీలో ఉన్నాడు. ఎపిలోని నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం విజయ్భాస్కర్రెడ్డి(63) హైదరాబాద్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు నెలల నుంచి కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న అడ్డగుట్టలోని నెస్ట్ అవే హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల 20వ తేదీ నుంచి విజయ్భాస్కర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతడి అల్లుడు జయసృజన్రెడ్డి కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు హాస్టల్ సమీపంలోని సిసిటివిల ఫుటేజ్ను పరిశీలించగా కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు చేసి మాజీ సైనికోద్యోగి మల్లేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్, కృష్ణం రాజు, ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ ప్రకృతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తానంటూ ఆశ్రమం తెరిచిన గురూజీకి పలువురు భక్తులు ఉన్నారు. ఈ గురూజీ విజయ్ భాస్కర్ రెడ్డి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలిసింది. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయడంతో గురూజీ హత్య చేయించినట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేస్తుండడంతో గురూజీ పరారయ్యాడు. పోలీసులు ప్రధాన నిందితుడు గురూజీని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
Arrest of accused in real estate trader murder case