Friday, May 10, 2024

సమున్నత కళ చెదిరింది

- Advertisement -
- Advertisement -

ముంబై : బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ సినిమాలకు కళాత్మక సెట్లు సమకూర్చిన ఆర్ట్‌డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై సమీపంలోని కర్జాత్ వద్ద ఉన్న ఆయన సొంత స్టూడియోలో ఆయన ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. జోధా అక్బర్, లగాన్ వంటి సినిమాలకు ఆయన సమకూర్చిన సెట్లు వాస్తవికతలకు అనుగుణంగా కళాత్మక ఉటిపడేలా నిలిచాయి.కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్ రూపశిల్సి కూడా ఆయనే. పలు అత్యద్భుత సెట్లను నిర్మించిన ఆయన చివరికి తన కళాత్మక సృష్టికి పనిచేసే చోటనే విగతజీవిగా పడి ఉండటాన్ని బుధవారం గుర్తించారు. దేశాయ్ కంపెనీ ఎన్‌డి ఆర్ట్ వరల్డ్ ప్రైవేటు లిమిటెడ్ భారీ స్థాయి అప్పుల్లో కూరుకుపోయింది. దాదాపుగా ఆయన కంపెనీ తరఫున రూ 252 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని వెల్లడైంది.

గత వారమే కోర్టులో దాఖలు అయిన దివాళా పరిష్కార కేసుతో ఈ అప్పుల భారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఎన్‌డి స్టూడియోలో దేశాయ్ భౌతిక కాయం తాడుకు వెలాడుతూ ఉండగా కనుగొన్నారని రాయ్‌గఢ్ స్‌పి సోమ్‌నాథ్ ఘార్గే విలేకరులకు తెలిపారు. ఇది ఆత్మహత్యగా తేలుతోందని, అయితే కేసును పలు కోణాల నుంచి దర్యాప్తు చేయడం జరుగుతుందని వివరించారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో దేశాయ్ స్టూడియో ఉంది. ఆయన మృతి గురించి తెలియగానే పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి వెళ్లింది. 2016 , 2018లలో దేశాయ్ కంపెనీ ఇసిఎల్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ 185 కోట్ల మేర రెండు రుణాలను తీసుకుందని వెల్లడైంది. 2020 జనవరి నుంచి దేశాయ్‌కు ఈ రుణాల చెల్లింపులపై ఒత్తిడి పెరుగుతూ వచ్చినట్లు వెల్లడైంది.

ఆయన కొద్దికాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నట్లు , ఆర్థిక చిక్కులతోనే బలవన్మరణం చెందినట్లు ఉరాన్‌కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మహేష్ బాల్డీ తెలిపారు. తెల్లవారుజామున నాలుగు లేదా నాలుగున్నరకు ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. రెండు మూడు నెలలుగా దేశాయ్ స్టూడియోలో పని నిలిచిపోయింది. మంగళవారం రాత్రి ఈ ఆర్ట్‌డైరెక్టర్ స్టూడియోకు వచ్చినట్లు స్థానిక వ్యక్తి తెలిపారు. 30 ఏళ్ల తమ కళా దర్శక కాలంలో దేశాయ్ పలువురు ప్రముఖ దర్శకులతో కలిసిపనిచేశారు. పలు సినిమాలకు ప్రాణం పోశారు. దర్శకులు విధూ వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాల్, రాజ్‌కుమార్ హిరాని, అశుతోష్ గోవారికర్ వంటి వారి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

దేవదాసు, జోదా అక్బర్ , ప్రేమ్త్రన్ ధన్ పాయో ,పరిందా వంటి సినిమాలకు ఆయన వేసిన సెట్లు అప్పటి కాలానికి అనుగుణంగా సజీవ రీతిలో నిలిచాయి. ఈయన కంపెనీ ఇతర బిజినెస్‌లలో కూడా ఉంది. హోటల్స్, థీమ్ రెస్టారెంట్లు, చారిత్రక కట్టడాల నమూనాల రూపకల్పనలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ల పనులు కూడా నిర్వహించారు. నితిన్ దేశాయ్‌కు భార్య నైనా నితిన్ దేశాయ్. ఆమె నిర్మాతగా ఉన్నారు. ఓ బాబును పాపను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు విషాదాంతం అయిన నితిన్ కళాసృష్టికి నాలుగు సార్లు ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ కళాదర్శకత్వ పురస్కారాలు, పలుమార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. 52 ఎకరాల సువిశాల స్థలంలో ఆయన స్టూడియో వెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News