గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం : మంత్రి శ్రీనివాసగౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామపంచాయతీ శివారులోని ఒంటి గుడిసె తండాలో ఆదివారం నాడు ఎక్సైజ్ పోలీసులపై తండావాసులు దాడీ జరిగింది. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐ బాలాజీ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా తాండా వాసుల దాడీలో గాయపడి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు. అదేవిధంగా గుడుంబా తయారు చేస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాల ఆదుకుంటామని వివరించారు.
రాష్ట్రంలో గుడుంబా తయారీ దారులపై పిడి యాక్ట్ తో పాటు ఇతర చట్టాలను కూడా ఉపయోగిస్తామని, గుడుంబా తయారీని ప్రణాళికాబద్ధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుడుంబా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యతని, ప్రజలు ప్రాణాలు తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గుడుంబా రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. అయితే కొందరు లాక్ డౌన్ ను అదనుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి బెల్లం, ఇతర పదార్థాలు తీసుకువచ్చి ఆక్రమంగా గుడుంబా తయారు చేయడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఇలాంటి తయారీదారులను అరికడతామని మంత్రి పునరుద్ఘాటించారు.